Tuesday 19 June 2012

చిట్టా విప్పిన కోలా కృష్ణమోహన్

చంద్రబాబు సన్నిహితులకు మారిషస్‌లో పలు బ్యాంకు ఖాతాలు



ఖాతా నంబర్లతో సహా బయటపెట్టిన నాటి బాబు సన్నిహితుడు
బాబు సింగపూర్ ఖాతా వివరాలను ముందే చెప్పిన కోలా
డాయిషే బ్యాంకులో సి. నాయుడు నారా పేరుతో బాబుకు ఖాతా
అకౌంట్ నంబర్ 2248634590-4985 అని వెల్లడించిన కోలా
ఆ ఖాతాకు తాను రూ. 4 కోట్లు బదిలీ చేసినట్లు ఇటీవలే వెల్లడి
బాబు చీకటి రహస్యాలన్నీ బయటపెడతానని ఆనాడే ప్రకటన
పూర్తి వివరాలను హైకోర్టుకు, ఈడీకి అందిస్తానని స్పష్టీకరణ
కోలా ఆరోపణలు అబద్ధమంటూ వారంలో వివరాలు చెప్తానన్న బాబు
పది రోజులు గడిచినా ఆ ఆరోపణలపై స్పందించని టీడీపీ అధినేత
విదేశీ ఖాతాలపై దర్యాప్తు జరగాలంటున్న రాజకీయ పరిశీలకులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంధ్రా అన్నా హజారే అనిపించుకోవాలని నిత్యం తాపత్రయపడే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి అవినీతి బాగోతం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. చంద్రబాబు సింగపూర్ బ్యాంక్ ఖాతా రహస్యాన్ని బట్టబయలు చేసిన కోలా కృష్ణమోహన్.. తాజాగా బాబు అండ్ కోకు చెందిన మరిన్ని రహస్య ఖాతాల వివరాలు బహిర్గతం చేశారు. తనకు పార్టీ టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు రూ. 5.10 కోట్లు దండుకున్నారని.. అందులో రూ. 4 కోట్లు బాబు సింగపూర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశానని ఆరోపించటంతో పాటు.. సదరు బ్యాంక్ ఖాతా నంబర్‌ను కూడా కోలా (యూరో లాటరీ తగిలిందని చెపుకున్న వ్యక్తి) ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు సన్నిహితుడిగా మెలిగిన కృష్ణమోహన్.. తాజాగా బాబు సమీప బంధువులు, సన్నిహితుల విదేశీ బ్యాంక్ అకౌంట్ల వివరాలను బయటపెట్టారు. చంద్రబాబు అవినీతి బాగోతానికి సంబంధించి దశల వారీగా వివరాలు వెల్లడిస్తానని అప్పట్లోనే చెప్పిన కృష్ణమోహన్ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భద్రత దృష్ట్యా తాను బహిరంగంగా మీడియా సమావేశం నిర్వహించలేకపోతున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, అయన సన్నిహితులకు చెందిన ఎనిమిది విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలను కృష్ణమోహన్ వెల్లడించారు. పంజాగుట్టలోని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా 1998కి ముందే ఆయా ఖాతాలను ఓపెన్ చేశారని కృష్ణమోహన్ వివరాలతో సహా పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు, ఆయన సన్నిహితుల ఖాతాల్లో లక్షలాది డాలర్ల లావాదేవీలు జరిగాయని, ఈ వివరాలను త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్‌కు వెల్లడిస్తానని కృష్ణమోహన్ చెప్పారు.

బాబు చీకటి ఖాతా వెలుగులోకి...


సింగపూర్‌లో చంద్రబాబుకు గల చీకటి ఖాతాను కోలా కృష్ణమోహన్ గతంలోనే బయటపెట్టారు. తన బ్యాంక్ ఖాతా నుంచి చంద్రబాబు సింగపూర్ బ్యాంక్ ఖాతాకు డబ్బును మళ్లించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్ ఈ నెల 9వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు నాకు ఆశచూపారు. అందుకు డబ్బులు అడిగారు. చంద్రబాబుకు తొలుత రూ. 10 లక్షలు చెక్కు రూపంలో ఇచ్చాను. 1999 ఏప్రిల్ 24న చంద్రబాబు ఇంట్లో స్వయంగా కోటి రూపాయల నగదు ఇచ్చా. అదే ఏడాది ఆగస్టులో.. సి. నాయుడు నారా పేరుతో సింగపూర్ రాఫెల్స్‌క్యూలోని డాయిషే బ్యాంక్‌లో గల 2248634590-4985 నంబరు గల ఖాతాకు రూ. 4 కోట్లు బదిలీ చేశా’’ అని వివరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనపై ఎన్‌ఫోర్స్‌మెండ్ డెరైక్టరేట్ అధికారులు దాడులు చేయగా.. బాబు విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు వారికి తెలిసిందని.. అయితే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రూ. 50 లక్షలు లంచం ఇచ్చి ఈడీ అధికారులను మేనేజ్ చేశారని కూడా కోలా వివరించారు. అలాగే.. బాబుకు తాను నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం బయటపెట్టకూడదంటూ ఆనాటి పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాల ఉన్నతాధికారులు స్వయంగా బెదిరించారనీ తెలిపారు. ఆ తర్వాత తనపై హత్యా యత్నాలు కూడా జరిగాయని చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ కృష్ణమోహన్ 420 అని ఆరోపించటమే తప్ప తన బ్యాంక్ ఖాతా గురించి ఒక్క మాట మాట్లాడలేదు.


బాబుకు సింగపూర్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నదని కృష్ణమోహన్ వెల్లడిస్తే.. తనకు స్విస్ బ్యాంక్‌లో ఎలాంటి ఖాతాలు లేవని చంద్రబాబు పేర్కొనటం గమనార్హం. కోలా చెప్పిన మాటలు అబద్ధమని, తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు వారంలో బయటపెడతానని ప్రకటించారు. కానీ.. పది రోజులు గడచిపోయినా ఆ ఊసే ఎత్తలేదు. చంద్రబాబు తనను 420గా అభివర్ణించటంపై కృష్ణమోహన్ అంతే స్థాయిలో స్పందించారు. తాను 420 అయితే చంద్రబాబు 42000 అంటూ ఘాటుగా స్పందించారు. తాను ఇచ్చిన వివరాలు వాస్తవమని, వాటిపై దర్యాప్తు జరపాలని హైకోర్టును ఆశ్రయించటంతో పాటు తన దగ్గర ఉన్న అన్ని వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు వెల్లడిస్తానని కృష్ణమోహన్ మరోసారి వెల్లడించారు. మొత్తం మీద చంద్రబాబు, ఆయన సన్నిహితుల విదేశీ బ్యాంక్ ఖాతాల వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. మామూలుగా ఆరోపణలకు పరిమితం కాకుండా బ్యాంక్ పేర్లు, వాటిలో ఖాతా నెంబర్లు కూడా కృష్ణమోహన్ వెల్లడించటంతో ఇప్పుడు చంద్రబాబు సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బాబు విదేశీ ప్రయాణాల రహస్యమేమిటో?

కోలా తాజా ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఏటా సాగించే రహస్య విదేశీ ప్రయాణాలపై ఇప్పుడు అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. చంద్రబాబు ఏటా తన కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ మీదుగా ఏదో దేశానికి వెళ్లి వస్తుంటారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి తానెక్కడికి వెళుతున్నాన్నది ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారన్నది అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడు సింగపూర్, మారిషస్‌లతో పాటు పలు దేశాల్లో బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని వెల్లడి కావటంతో ఈ రహస్యం త్వరలోనే బట్టబయలయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కృష్ణమోహన్ బ్యాంక్ ఖాతా నంబర్లు కూడా ఇచ్చినందున వాటి వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపై ఉన్నదని కూడా వారంటున్నారు.

No comments:

Post a Comment