ఇబ్రహీంపట్నం(కృష్ణా),
గుంటూరు, న్యూస్లైన్: రాచకుంట సాంబశివరావు అలియాస్ సైకో సాంబ పోలీసుల్ని
పరుగుపెట్టిస్తున్నాడు. చిక్కినట్టే చిక్కి కొండపల్లి ఖిల్లాపై పరారైన
సాంబశివరావు కోసం 300మంది గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు కూంబింగ్
నిర్వహిస్తున్నారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిధిలో శుక్రవారం
ముమ్మరంగా గాలించారు. సైకో తప్పించుకుని కొండపై నుంచి జారుకుంటూ కిందకు
వెళ్లిపోయినట్లు నిర్ధారించారు.
ఖిల్లా పరిసర ప్రాంతాల గురించి
అతనికి బాగా తెలిసి ఉంటుందని, అందుకే పోలీసులకు మాయమాటలు చెప్పి ఇక్కడికి
తీసుకువచ్చి పరారయ్యాడని భావిస్తున్న పోలీసు అధికారులు పరిసర గ్రామాల
ప్రజల్ని అప్రమత్తం చేశారు. రిజర్వు ఫారెస్టుని ఆనుకుని ఉన్న మూలపాడు,
జూపూడి, కేతనకొండ, పరిటాల, కంచికచర్ల, జి.కొండూరు తదితర గ్రామాల్లో పోలీసు
బలగాలను మోహరించారు. అడవిలో ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా నిశితంగా
పరిశీలించాకే వదలిపెడుతున్నారు. ఖిల్లాకు ఆనుకుని ఉన్న కాలనీల్లో కూడా
వీఆర్వోల సాయంతో గాలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే
పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలని కొండపల్లిలో దండోరా వేయించారు.
కొండపల్లి ఎస్టీ కాలనీలో నేరస్వభావం కలిగిన కొందరు వ్యక్తులపై నిఘా వేశారు.
గతంలో ఎన్కౌంటర్కు గురైన గజదొంగ అడపా వెంకన్న కొండపల్లిలో కొద్దిరోజులు
తలదాచుకున్నాడు. ఖిల్లాపై పరారైన సాంబశివరావు కూడా కొండపల్లిలో ఎవరిదైనా
సహకారం తీసుకుని ఉంటాడా.. అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాళ్లకు బేడీలున్న వ్యక్తిని చూసిన మహిళ
కాళ్లకు బేడీలున్న ఒక వ్యక్తి శుక్రవారం సాయంత్రం కుంటుతూ అడవి నుంచి
శాంతినగర్ మీదుగా వెళ్లటం చూసినట్లు ఒక మహిళ పోలీసు అధికారులకు తెలిపింది.
నిందితుడు శాంతినగర్ వరకు వచ్చాడంటే రెలైక్కి పరారై ఉండవచ్చని, లేకపోతే
విజయవాడ నగరం వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సైకో
సాంబశివరావు తమ ప్రాంతంలో ఉన్నాడని మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు
భయాందోళనలకు గురవుతున్నారు. అతడు మాయమైన ప్రదేశానికి సమీపంలోనే జూపూడిలోని
నిమ్రా, నోవా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. సాం బశివరావు వ్యవహారంతో
కళాశాలలకు వచ్చే విద్యార్థినులు భయపడుతున్నారు.
మోస్ట్వాంటెడ్ క్రిమినల్కు నామమాత్రపు ఎస్కార్టా?
నాలుగు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న సాంబశివరావుకు పోలీసులు
నామమాత్రంగా ఎస్కార్ట ఏర్పాటుచేసి తీసుకెళ్లడంపై అనేక అనుమానాలు
తలెత్తుతున్నాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 2005 నుంచి
ఇప్పటివరకు 80కిపైగా కేసులు నమోదయ్యాయి. సైకోని పట్టుకుంది మంగళగిరి రూరల్
పోలీసులు కాగా అర్బన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై
ప్రస్తుతం పోలీసు బాస్ల వద్ద పంచాయితీ సాగుతోంది. కాగా, కొండ పరిసర
ప్రాంతాలు దట్టంగా ఉండటంతో కూంబింగ్కు కొంత ఇబ్బంది ఉందని, సాధ్యమైనంత
త్వరగా పట్టుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ రవికృష్ణ ‘న్యూస్లైన్’కు
తెలిపారు.
|
|
No comments:
Post a Comment